Type Here to Get Search Results !

AP TET MARKS , RESPONSE SHEETS NEWS

టెట్ మార్కులు చూస్తే షాక్‌!

 *♦️రివ్యూ ఆప్షన్‌పై అభ్యర్థుల అనుమానాలు*

*♦️సమాధానం మార్చినా మొదటిదే చూపిస్తోందిరెస్పాన్స్‌ షీట్లు చూసి ఆందోళన*

*♦️అసలు పెట్టనట్లుగా వచ్చిందంటున్న కొందరు*

*♦️స్పష్టత ఇవ్వని పాఠశాల విద్యాశాఖ*

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అభ్యర్థుల్లో కొత్త గందరగోళం రేపుతోంది. ఈసారి టెట్‌ నిర్వహణే అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేయగా, పరీక్షల అనంతరం మార్కుల ప్రక్రియపైనా అనుమానాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా రివ్యూ ఆప్షన్‌పై ఈ సందేహాలు వినిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ తాజాగా రెస్పాన్స్‌ షీట్లు (జవాబు పత్రాలు) ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులందరూ వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని షాక్‌ తింటున్నారు!. మొత్తంగా సాంకేతిక సమస్యలతో టెట్‌ పరీక్ష గందరగోళంగా మారినట్లు కనిపిస్తోంది.
రివ్యూ విధానం ఇలా...టెట్‌ 150 మార్కులకు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష  నిర్వహిస్తారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా వారు ఎంచుకున్న సబ్జెక్టుల ఆధారంగా లాగ్వేంజ్‌లు, సబ్జెక్టులను 30 ప్రశ్నలుగా వేర్వేరుగా చూపిస్తారు. ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తే అది గ్రీన్‌ కలర్‌లోకి మారుతుంది. ప్రశ్నను ఓపెన్‌ చేసి సమాధానం పెట్టకపోతే అది రెడ్‌ కలర్‌లోనే ఉంటుంది. ఒకసారి సమాధానం పెట్టిన తర్వాత మళ్లీ ఆ ప్రశ్నను ఓపెన్‌చేస్తే రివ్యూ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే సమాధానం మార్చుకునే అవకాశం లభిస్తుంది. అయితే, రివ్యూ ఆప్షన్‌ ఎంచుకుని సమాధానం మార్చినా తొలుత పెట్టిన సమాధానం ఆధారంగానే మార్కులు వచ్చాయని అభ్యర్థులు అంటున్నారు. దీంతో దాదాపు 10 మార్కులు కోల్పోయామని చెబుతున్నారు. అయితే నాలుగింట్లో సరైన సమాధానం లేకపోవడం, ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలుండటం లాంటి వాటికే అభ్యంతరాలు స్వీకరిస్తారు. కంప్యూటర్‌లో ఒక సమాధానం పెడితే మరొకటి కనిపిస్తోంది అనేదానిపై అభ్యంతరాలు స్వీకరించే అవకాశం లేదు. దీంతో టెట్‌లో అర్హత మార్కులు రావేమోనని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారుల వివరణ కోసం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
ఆది నుంచీ ఇంతే..2018 తర్వాత మళ్లీ ఇప్పుడే టెట్‌ నిర్వహించారు. మొత్తం 5.25లక్షల మంది  దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రంలో తగినన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది ఇతర రాష్ర్టాల్లో పరీక్షా కేంద్రాలు ఎంచుకోవాల్సి వచ్చింది. పరీక్ష ముగిసి ఐదు రోజులవుతున్నా ఇప్పటికీ ఎంతమంది రాశారో పాఠశాల విద్యాశాఖ బహిర్గతం చేయడంలేదు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన టెట్‌ గందరగోళంగా మారిందని అభ్యర్థులు చెబుతున్నారు.


Tags
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...